Proposals worth Rs.10.42 crore under PMMSY scheme approved by Collector A. Suryakumari at * District Committee Meeting
Publish Date : 25/06/2022
పీఎంఎంఎస్వై పథకంలో రూ.10.42 కోట్లతో ప్రతిపాదనలు
*జిల్లా కమిటీ సమావేశంలో ఆమోదించిన కలెక్టర్ ఎ. సూర్యకుమారి
విజయనగరం, జూన్ 24 ః ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్వై) పథకంలో భాగంగా వివిధ వర్గాల వారికి ఉపాధి కల్పించే నిమిత్తం వివిధ యూనిట్ల కొనుగోళ్లకు, అభివృద్ధి పనులకు సంబంధించి రూ.10.42 కోట్లతో మత్స్య శాఖ విభాగ అధికారులు ప్రతిపాదనలు రూపొందించగా జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి ఆమోదనం తెలిపారు. పీఎంఎంఎస్వై పథకంలో భాగంగా రూపొందించిన ప్రతిపాదనలపై శుక్రవారం తన ఛాంబర్లో జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. మహిళల ఉపాధికి ఊతం ఇచ్చేలా అత్యధిక యూనిట్లు కేటాయించేందుకు చర్యలు తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఐస్ బాక్స్తో కూడిన మోటర్ సైకిల్స్, వాహన భీమా, బోట్లు సమకూర్చుట, రీ సర్క్యులేటరీ ఆక్వా సిస్టమ్ ఏర్పాటు, లవ్ ఫిష్ వెండింగ్ తదితర అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికాయుత చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఈ సందర్భంగా మత్స్యశాఖ అధికారులను ఆదేశించారు. పోలిపల్లిలో ఏర్పాటు చేయబోయే రీ సర్క్యులేటరీ ఆక్వా సిస్టమ్ ను డీఆర్డీఏ పీడీతో పాటు వెళ్లి పరిశీలించామని మత్స్య శాఖ డీడీ ఈ సందర్భంగా కమిటీకి నివేదించారు. పూర్తిస్థాయిలో పరిశీలన చేసిన అనంతరం జిల్లా అవసరాలను దృష్టిలో ఉంచుకొని కార్యచరణ రూపొందిస్తామని పేర్కొన్నారు.
సమావేశంలో మత్స్యశాఖ డీడీ నిర్మలా కుమారి, డీఆర్డీఏ పీడీ కల్యాణ చక్రవర్తి, ఎల్.డి.ఎం. శ్రీనివాసరావు, ట్రైబల్ వెల్ఫేర్ డీడీ చంద్రబాబు, వ్యవసాయ శాఖ ఏడీ అన్నపూర్ణ, ఎఫ్.డి.వో. చాందిని, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.
