Reduce air pollution, promote e-bikes and CNG vehicles, District Collector A. Suryakumari
Publish Date : 29/11/2021
వాయు కాలుష్యాన్ని తగ్గించాలి
ఇ-బైకులు, సిఎన్జి వాహానాలను ప్రోత్సహించాలి
జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి
విజయనగరం, నవంబరు 27 ః వాయుకాలుష్యాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి ఆదేశించారు. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్పై తన ఛాంబర్ లో వివిధ శాఖల అధికారులతో శనివారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నేషనల్ క్లీన్ ఎయిర్ కార్యక్రమానికి దేశంలో మొత్తం 122 నగరాలను ఎంపిక చేయగా, దానిలో విజయనగరం కూడా ఉందన్నారు. రానున్న ఐదేళ్లలో వాయు కాలుష్యాన్ని 20 శాతం నుంచి 30 శాతం వరకూ తగ్గించాలన్నది ఈ కార్యక్రమం లక్ష్యమని చెప్పారు. దీనిలో భాగంగా కాలుష్య నివారణా చర్యలను చేపట్టాలని సూచించారు. కాలం చెల్లిన పాతవాహనాలపై దృష్టిపెట్టి, కాలుష్య పరిక్షలు నిర్వహించాలన్నారు. ఈ-బైకులు, సిఎన్జి ఆటోలను ప్రోత్సహించాలన్నారు. సోలార్ వాహనాలను, ఇతర పరికరాల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా వాయు కాలుష్యం తగ్గే అవకాశం ఉందన్నారు. రోడ్లపై దుమ్ము రేగకుండా నీరు చిలకరించే యంత్రాలను, రోడ్లు ఊడ్చే యంత్రాలను కొనుగోలు చేయాలని సూచించారు. అలాగే శబ్ద కాలుష్యం కూడా పెరిగిపోతోందని, దానిని తగ్గించడంపైనా దృష్టి సారించాలన్నారు. దీనికోసం నో హారన్ బోర్డులు, స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు తదితర చర్యలను చేపట్టాలని సూచించారు. ప్రజల్లో కాలుష్య నివారణా చర్యలపట్ల అవగాహన పెంచడం ద్వారా, వారిని కూడా ఈ కార్యక్రమంలో మమేకం చేయాలని సూచించారు. దీనికోసం విస్తృతంగా అవగాహనా కార్యక్రమాలను నిర్వహించి, ప్రజల్ని చైతన్య పరచాలని వివిధ శాఖలను కలెక్టర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో పొల్యూషన్ ఇంజనీర్ టి.సుదర్శన్, మున్సిపల్ కమిషనర్ ఎస్ఎస్ వర్మ, హౌసింగ్ పిడి పి.కూర్మినాయుడు, డిప్యుటీ ట్రాన్స్పోర్టు కమిషనర్ శ్రీదేవి, పొల్యూషన్ ఏఈ ఎస్.బీణాలహరి, బ్రేక్ ఇన్స్పెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.