Shilparam Start People should make use of: Collector Suryakumari
Publish Date : 06/06/2022
శిల్పారామం ప్రారంభం
ప్రజలు వినియోగించుకోవాలి ః కలెక్టర్ సూర్యకుమారి
విజయనగరం, జూన్ 01 ః
విజయనగరం పట్టణం బాబామెట్ట వద్ద సుమారు 41 ఎకరాల్లో, రూ.15లక్షల ఖర్చుతో అహ్లాదకరమైన వాతావరణంలో నిర్మించిన శిల్పారామం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. పెద్దలతోపాటు, పిల్లలు సైతం సేదదీరేవిధంగా, శిల్పారామం ఆర్ట్స్ క్రాఫ్ట్స్ అండ్ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో అన్ని సౌకర్యాలతో నిర్మించిన ఈ శిల్పకళా వేదికను బుధవారం సాయంత్రం, జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ మజ్జి శ్రీనివాసరావు, కలెక్టర్ ఎ.సూర్యకుమారి, ఎంఎల్ఏ కోలగట్ల వీరభద్రస్వామి, మేయర్ వి.విజయలక్ష్మితో కలిసి ప్రారంభించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాల్స్ను, మామిడి విక్రయాలను కూడా ప్రారంభించారు. ఇక్కడి సాంస్కృతిక కళావేదికవద్ద, సత్యారావు ఆధ్వర్యంలో అతని శిష్యబృందం నిర్వహించిన కర్రసాము, కత్తిసాము తదితర యుధ్దవిద్యలను తిలకించారు. అనంతరం మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల విద్యార్ధులు ప్రదర్శించిన నాదస్వర కచేరీ వీనులువిందుగా సాగింది.
ఈ సందర్భంగా కలెక్టర్ సూర్యకుమారి మాట్లాడుతూ, జిల్లా అవతరణ దినోత్సవం రోజున, శిల్పారామాన్ని ప్రారంభించి, ప్రజలకు అందుబాటులోకి తెచ్చినందుకు హర్షం వ్యక్తం చేశారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని, తమ కుటుంబాలతో దీనిని సందర్శించాలని కోరారు. పిల్లల కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లను చేయడం జరిగిందని చెప్పారు. ప్రజలకు అవసరమైన హేండీ క్రాప్ట్స్, చేనేత వస్త్రాలు, ఫుడ్ కోర్టు, ఇతర వివిధ రకాల ఉత్పత్తులను విక్రయించేందుకు స్టాల్స్ను కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రజలనుంచి వచ్చే స్పందన బట్టి, వారి అవసరాలకు అనుగుణంగా మార్పులు, చేర్పులు చేస్తామన్నారు. ఈ రోజు నుంచి వరుసగా 14 రోజులపాటు ఈ వేదికపై, మహారాజా ప్రభుత్వ సంగీత కళాశాల ఆధ్వర్యంలో సాంస్కృతిక ప్రదర్శనలను ఏర్పాటు చేశామని, ప్రజలంతా ప్రతిరోజూ ఇక్కడికి వచ్చి, ఈ ప్రదర్శనలను తిలకించాలని కలెక్టర్ కోరారు.
కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పి దీపికా పాటిల్ మాట్లాడుతూ, శిల్పారామం వద్ద తగిన భద్రతా ఏర్పాట్లు చేస్తామన్నారు. దిశ వాహనాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తామని, రాత్రి సమయంలో గస్తీ కూడా నిర్వహిస్తామని తెలిపారు. శిల్పారామం ప్రాంతంలో భద్రతపై ఎటువంటి ఆందోళనా చెందవద్దని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖాధికారి పిఎన్వి లక్ష్మీనారాయణ, మున్సిపల్ కమిషనర్ శ్రీరాములనాయుడు, డిఆర్డిఏ పిడి ఎం.అశోక్కుమార్, మెప్మా పిడి సుధాకరరావు, హార్టికల్చర్ డిడి శ్రీనివాసరావు, సంగీత కళాశాల ప్రిన్సిపాల్ ఆర్వి ప్రసన్నకుమారి, శిల్పారామం ఏఓ రమణ, పలువురు కార్పొరేటర్లు, నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
