Special function for accelerating housing, Collector setting weekly targets.
Publish Date : 23/05/2022
గృహనిర్మాణం వేగవంతానికి ప్రత్యేక కార్యాచరణ
వారం వారం లక్ష్యాలను నిర్ధేశించిన కలెక్టర్
విజయనగరం, మే 21 ః
జిల్లాలో జగనన్న గృహనిర్మాణ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయడానికి జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి చర్యలు తీసుకున్నారు. దీనిలో భాగంగా తరచూ జగనన్న కాలనీలను సందర్శించి, పనుల పురోగతిని ప్రత్యక్షంగా పరిశీలించడమే కాకుండా, సంబంధిత అధికారులకు వారం వారం లక్ష్యాలను నిర్ధేశించారు. మండలాల వారీగా, రెవెన్యూ డివిజన్ల వారీగా ప్రతీ వారం ప్రగతి నివేదికలను ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా తొలివిడత 79,066 ఇళ్లు మంజూరు కాగా, వీటిలో బొబ్బిలి డివిజన్లో 21,742, చీపురుపల్లి డివిజన్లో 19,895, విజయనగరం డివిజన్లో 37,429 ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో ఇంకా జిల్లా వ్యాప్తంగా 16,256 ఇళ్ల నిర్మాణం ప్రారంభం కావాల్సి ఉంది. వీటిలో ఈ వారంలో కనీసం 3వేల ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా జోరుగా గృహనిర్మాణం జరుగుతుండటంతో, స్టేజ్ అప్డేషన్ ప్రక్రియను నిరంతరం కొనసాగించాలని సూచించారు. ప్రతీవారం దశలవారీగా పునాదులు పూర్తయిన ఇళ్ల వివరాలు, శ్లాబ్ వరకు గోడలు నిర్మాణం, శ్లాబ్ వేయడం, ఇంటి నిర్మాణం మొత్తం పూర్తికావడం తదితర దశల వారీగా వివరాలను ఎప్పటికప్పుడు అందజేయాలని ఆదేశించారు. ప్రతీ దశలోనూ, ప్రతీవారం తప్పనిసరిగా పురోగతి కనపర్చాలని స్పష్టం చేశారు. దీనికోసం దశలవారీగా, రోజువారీ ప్రగతిని కూడా నమోదు చేయాలని ఆదేశాలు రావడంతో, ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా గృహనిర్మాణ కార్యక్రమం వేగంగా జరుగుతోంది.
