Special meeting with representatives of the Chamber of Commerce and officials at the Collectorate
Publish Date : 03/12/2021
*మహిళా పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు రంగం సిద్ధం*
* ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం
* సాంకేతిక ప్రక్రియలు పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ఆదేశాలు
* ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, అధికారులతో కలెక్టరేట్లో ప్రత్యేక భేటీ
జిల్లాలో మహిళా పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ప్రక్రియను వేగవంతం చేయాలని, సంబంధిత సాంకేతిక ప్రక్రియలను పూర్తి చేసి నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఎ. సూర్యకుమారి జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనలు, ఆదేశాలను అనుసరిస్తూ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు ఆమె ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీస్, ఏపీఐఐసీ అధికారులతో కలెక్టరేట్ మీటింగ్ హాలులో బుధవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కొత్తవలస సమీపంలోని అర్ధానపాలెంలో పారిశ్రామిక ఏర్పాటుకు అనుసరించాల్సిన విధివిధానాలపై దిశానిర్దేశం చేశారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల నుంచి ప్రతిపాదనల మేరకు సంబంధిత చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు.
ఇది వరకు ప్రభుత్వం జారీ చేసిన జీవోను అనుసరించి భూ సేకరణ, భూ కేటాయింపు తదితర అంశాల్లో ముందుకెళ్లాలని ఏపీఐఐసీ, ఇండస్ట్రీస్, రెవెన్యూ అధికారులకు కలెక్టర్ సూచించారు. కొత్తవలస సమీపంలోని అర్ధానపాలెంలో మొదటి ఫేజ్లో భాగంగా సుమారు 70 ఎకరాలు స్థలం ఏపీఐఐసీకి కేటాయించేందుకు కలెక్టర్ సూర్యకుమారి నిర్ణయించారు. దీనిలో భాగంగా స్థల పరిశీలన చేసి పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని, సంబంధిత నివేదికను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ఎల్లప్పుడూ ప్రోత్సాహం ఉంటుందని మరింత మంది ముందుకు రావాలని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ క్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు పలు అంశాలను ప్రస్తావించారు. స్థలాల కేటాయింపులో అనుసరించే విధానాలపై, ధరల నిర్ణయంపై ముందుగానే స్పష్టత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. త్వరితగతిన స్థలాల కేటాయింపు జరిగేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు.
సమావేశంలో జాయింట్ కలెక్టర్ జె. వెంకటరావు, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ పాపారావు, డీఐసీ జీఎం జి.ఎం. శ్రీధర్, ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ విశాఖపట్టణం జోన్ ఛైర్మన్ కె.ఆర్.బి. ప్రకాశ్, మహిళా పారిశ్రామికవేత్తల కమిటీ ఛైర్ పర్సన్ ఎ. లీలా రాణి, ఏపీ ఛాంబర్స్ ప్రతినిధులు సాంబశివరావు, ఉమా ఎస్ అల్లూరి, యార్లగడ్డ గీత, ఐశ్వర్య, హిమబిందు తదితరులు పాల్గొన్నారు.