Special operation for conservation of aquifers * Plants should be planted to keep pond gates strong * Collector A. Suryakumari at a meeting on Convergence works
Publish Date : 14/06/2022
జలవనరుల సంరక్షణకు ప్రత్యేక కార్యాచరణ
*చెరువు గట్లు పటిష్ఠంగా ఉండేందుకు మొక్కలు నాటాలి
*కన్వర్జెన్స్ పనులపై సమావేశంలో కలెక్టర్ ఎ. సూర్యకుమారి
విజయనగరం, జూన్ 10 ః జిల్లాలో జలవనరుల సంరక్షణకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్లాలని, తాగునీటికి, సాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. చెరువు గట్లు పటిష్ఠంగా ఉండేందుకు వేర్లు బాగా ఉండే మొక్కలను నాటాలని సూచించారు. పచ్చదనానికి, పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని, చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని పేర్కొన్నారు. జిల్లాలో చేపట్టిన వివిధ కన్వర్జెన్స్ పనుల ప్రగతిపై ఆమె శుక్రవారం తన ఛాంబర్లో సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
డ్వామా నర్సరీలను అందుబాటులోకి తీసుకురావాలని, వాటి ద్వారా వచ్చే మొక్కలను పంచాయతీలకు అందజేసి పచ్చదనం పెంపునకు చర్యలు తీసుకోవాలని డ్వామా పీడీకి సూచించారు. వర్షపు నీటి పొదుపునకు తగిన చర్యలు తీసుకోవాలని, వాల్టా యాక్టకు సంబంధించిన కేసులను పరిష్కరించాలని డ్వామా పీడీకి చెప్పారు. జలశక్తి అభియాన్ లో పేర్కొన్న నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా చెరువులను ఆధునికీకరించాలని పేర్కొన్నారు. వర్షాకాలంలో ఉపాధి హామీ కూలీలకు పని కల్పించేలా ప్రత్యామ్నాయ పనులను గుర్తించాలని ఆదేశించారు. ఉపాధి కూలీల చేత జన్ ధన్ ఖాతాలు ఓపెన్ తెరిపించాలని చెప్పారు. పారిశుద్ధ్యం లోపించకుండా ఎక్కడికక్కడ చెత్త బుట్టలను ఏర్పాటు చేయాలని, సంతలు జరిగే చోట, వివాహాది కార్యక్రమాలు జరిగే చోట అధ్వాన పరిస్థితులు తలెత్తకుండా క్లీనింగ్ చేయించాలని డీపీవోకు చెప్పారు. చెత్త నుండి సందప తయారీ కేంద్రాలను త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. గోస్తనీ నదిలో చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. పంచాయతీ రాజ్ ఆధ్వర్యంలో జరిగే సచివాలయ భవనాలు, డిజిటల్ లైబ్రరీల పనులను నిర్ణీత కాలంలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని పంచాయతీ రాజ్ ఎస్.ఈ.ని ఆదేశించారు. తాగునీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని, ట్యాప్లు ఏర్పాటు చేయాలని ఆర్.డబ్ల్యూ.ఎస్. ఈఈకి సూచించారు.
వర్మీ కంపోస్టు వినియోగానికి చర్యలు
ప్రతి గ్రామంలో రైతులు వర్మీ కంపోస్టు వినియోగించేలా చర్యలు తీసుకోవాలని డీపీవోకు సూచించారు. ఈ విషయంలో వ్యవసాయ శాఖ నుంచి సహాయం తీసుకోవాలని చెప్పారు. చెత్త నుండి సంపద తయారీ కేంద్రాల నుంచి వర్మీ కంపోస్టు ఎరువును అవసరమైన రైతులకు అందజేసేలా ఏర్పాట్లు చేసుకోవాలని పేర్కొన్నారు. స్థానిక మండల వ్యవసాయ శాఖ అధికారులను, రైతు భరోసా కేంద్రాలను అనుసంధానంగా చేసుకొని గ్రామాల్లో వర్మీ కంపోస్టు వినియోగాన్ని పెంచాలని నిర్దేశించారు.
సమావేశంలో పంచాయతీ రాజ్ ఎస్.ఈ. గుప్తా, డీపీవో సుభాషిణి, డ్వామా పీడీ ఉమా పరమేశ్వరి, ఏపీడీ లక్ష్మణ్, ఆర్.డబ్ల్యూ.ఎస్. ఈఈ సుందర్ రాజన్ తదితరులు పాల్గొన్నారు.
