Strive to achieve the goal, District Collector Ms.Suryakumari,IAS Collector who congratulated Tenth Toppers
Publish Date : 08/06/2022
లక్ష్యసాధనకు కృషి చేయండి
జిల్లా కలెక్టర్ సూర్యకుమారి పిలుపు
టెన్త్ టాపర్స్ను అభినందించిన కలెక్టర్
విజయనగరం, జూన్ 07 ః ప్రతీ విద్యార్థీ తన జీవితానికి ఒక లక్ష్యాన్ని నిర్ధేశించుకొని, దానిని సాధించేందుకు కృషి చేయాలని విద్యార్థులకు జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి పిలుపునిచ్చారు. మరో ఐదారేళ్లపాటు బాగా కష్టపడి చదివితే, మంచి స్థానంలో స్ధిరపడవచ్చని సూచించారు. కష్టపడి, ప్రణాళికాబద్దంగా కృషి చేస్తే, ఏదైనా సాధించవచ్చని స్పష్టం చేశారు. పదోతరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులను సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను, జిల్లా కలెక్టర్ సూర్యకుమారి తన ఛాంబర్లో మంగళవారం అభినందించారు. వారితో సుమారు 30 నిమిషాలపాటు ముచ్చటించి, వారివారి వ్యక్తిగత లక్ష్యాలను, సామాజిక స్థితిగతులను తెలుసుకున్నారు. అత్యధిక శాతం విద్యార్థులు, తాము ఐఏఎస్ కావాలని అనుకుంటున్నట్లు చెప్పారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రస్తుతం కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంతో అవసరమని, ఇంగ్లీషు, హిందీ భాషలను నేర్చుకోవాలని చెప్పారు. ప్రతి విద్యార్ధీ పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలని కోరారు. సోషల్ మీడియాతో సమయాన్ని వృథా చేసుకోవద్దని, అవసరమైనంత మేరకు మాత్రమే వినియోగించుకోవాలని సూచించారు. సివిల్ సర్వీస్ ఉద్యోగాలను సాధించాలంటే, రోజుకు దాదాపు 20 గంటలపాటు ప్రణాళికాబద్దంగా చదవాల్సి ఉంటుందని అన్నారు. ప్రతీ అంశంపైనా కనీస అవగాహన అవసరమని చెప్పారు. సమకాలీన అంశాలను అధ్యయనం చేయడంతోపాటు, పత్రికల్లో ఎడిటోరియల్స్ను చదవాల్సి ఉంటుందని తెలిపారు. ఉన్నత లక్ష్యాన్ని ఏర్పరుచుకొని, దానిని చేరుకొనేందుకు అహర్నిశలూ కృషి చేయాలని, ఒకవేళ దానిని సాధించలేకపోయిన పక్షంలో, ప్రత్యామ్నాయ మార్గాన్ని కూడా ముందే సిద్దం చేసుకోవాలని సూచించారు. ప్రపంచంలో పలు కార్పొరేట్ కంపెనీలకు ప్రస్తుతం భారతీయులే సిఈఓలుగా ఉన్నారని, అలాంటివారిని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పారు. ఉన్నత చదువుల అనంతరం, కేవలం ఉద్యోగాల కోసమే తాపత్రాయ పడకుండా, స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకొని, వివిధ రకాలను సంస్థలను స్థాపించడం ద్వారా, తాము అభివృద్ది చెందడంతోపాటు, తమలాంటి మరికొందరికి ఉపాధి కల్పించే గొప్ప అవకాశం లభిస్తుందని అన్నారు. పదోతరగతి ఉత్తీర్ణులకు కెరీర్ కౌన్సిలింగ్ ఏర్పాటు చేయాలని, డిఇఓ డాక్టర్ ఎ.ఎం.జయశ్రీ కి కలెక్టర్ ఆదేశించారు.
కలెక్టర్ను కలిసిన వారిలో డిఇఓ జయశ్రీతోపాటు, అత్యధిక మార్కులను సాధించిన విద్యార్థులు వై.పద్మాకర్(590), ఎపి మోడల్ స్కూల్, విజయనగరం, ఎం.కిరణ్కుమార్(588) ఎపి మోడల్ స్కూల్, పెరుమాళి, కె.లక్ష్మీనారాయణ(587) జెడ్పిహెచ్ఎస్, కర్లాం, బి.సతీష్(586) జెడ్పిహెచ్ఎస్, జామి, వి.సంజన(586) ఎపిమోడల్ స్కూల్, పెరుమాళి, ఆనంద్ కృష్ణవినోద్(585)జెడ్పిహెచ్ఎస్, కుమరాం, మేఘన(585) ఎపిమోడల్ స్కూల్, వేపాడ, జి.లీలాకిరణ్(584), బిపిఎం హైస్కూల్, విజయనగరం, తదితరులు ఉన్నారు. అంతకుముందు ఈ విద్యార్థులకు, డిఇఓ జయశ్రీ చిరుకానుకలను బహూకరించి, అభినందించారు.
