Utilize the loan facility, seize the opportunity to achieve financial progress, District Collector Suryakumari in the loan disbursement ceremony
Publish Date : 09/06/2022
రుణ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి
*ఆర్థిక ప్రగతి సాధించేందుకు అవకాశంగా మలుచుకోవాలి
*రుణ వితరణ మహోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సూర్యకుమారి
విజయనగరం, జూన్ 08 ః బ్యాంకులు కల్పించే రుణ సదుపాయాలను సద్వినియోగం చేసుకొని ఆర్థిక ప్రగతి సాధించాలని రుణ గ్రహీతలను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి పేర్కొన్నారు. ఆర్థిక స్వయం సమృద్ధి సాధించేందుకు రుణ మేళాలు చక్కని వేదికలని, వాటిని సోపానాలుగా మలుచుకొని అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. ఒక ప్రత్యేకమైన లక్ష్యంతో నగదు ఖర్చు చేసి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. తీసుకున్న రుణాన్ని బాధ్యతగా సమయానికి తిరిగి చెల్లించాలని హితవు పలికారు. ఆజాది కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా లీడ్ బ్యాంకు ఆధ్వర్యంలో వివిధ బ్యాంకుల సమన్వయంతో స్థానిక ఆనంద గజపతి ఆడిటోరియంలో బుధవారం జరిగిన రుణ వితరణ మహోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలు, కల్పిస్తున్న వివిధ అవకాశాలను అందిపుచ్చుకోవటం కోసం ప్రభుత్వ, ప్రయివేటు రంగ బ్యాంకులు ఈ రుణ మేళాను నిర్వహించాయని, ఈ వేదికను వినియోగించుకొని ప్రతి ఒక్కరూ ఆర్థిక ఉన్నతి సాధించాలని పేర్కొన్నారు. తీసుకున్న రుణాన్ని సమయానికి తిరిగి చెల్లించి రుణ మేళాల ఉద్దేశాలను, సంప్రదాయాలను కాపాడాలని సూచించారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు, ఆశావహుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రుణ మేళాలు ఎంతో దోహదం చేస్తాయని పేర్కొన్నారు. ప్రతి పైసా బాధ్యతగా ఖర్చు చేయాలని, జీవితంలో మరొక మెట్టు ఎదగాలని రుణ గ్రహీతలకు సూచించారు. బ్యాంకర్స్ కూడా బాధ్యతగా వ్యవహరించాలని, ప్రజలకు ఇబ్బంది లేకుండా రుణ సదుపాయాలను కల్పించాలని, ఆర్థిక లావాదేవీలపై అవగాహన కల్పించాలని చెప్పారు.
కొత్త లక్ష్యంతో యువజన సంఘాలు
నూతన పారిశ్రామిక విధానాల ప్రభావంతో ఆర్థిక అంశాల్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. సులభరతమైన పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. నూనత పరిశ్రమలు నెలకొల్పేందుకు చాలా మంది ఆశావహులు ముందుకు వస్తున్నారు. దీనిలో భాగంగానే జిల్లాలో స్త్రీ, పురుషులతో కూడిన కొత్త యువజన సంఘాలు ఏర్పడుతున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. వీరికి రుణ సదుపాయం కల్పించటం ద్వారా మరిన్ని ప్రయోజనాలను చూరగొనాలని బ్యాంకర్లకు సూచించారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడే విధంగా ఆర్థిక విధానాలు ఉండాలని, ఆ దిశగా అందరూ సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు.
400 మందికి రూ.150 కోట్ల రుణ సదుపాయం
జిల్లాలోని వివిధ బ్యాంకుల సహకారంతో ఆజాది కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమ లక్ష్యాలను చేరుకునేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నామని ఎల్.డి.ఎం. శ్రీనివాసరావు పేర్కొన్నారు. రుణ మేళా ప్రారంభోత్సవం సందర్భంగా కార్యక్రమం ఉద్దేశాలను ఆయన వివరించారు. జిల్లాలో వివిధ రంగాల్లో పరిశ్రమలు నెలకొల్పేందుకు, ఇతర వ్యాపారాలు చేసుందుకు గాను ముందుకు వచ్చిన 400 పైచిలుకు ఔత్సాహికులకు రూ.150 కోట్ల రుణ సదుపాయాన్ని కల్పించామని పేర్కొన్నారు.
కార్యక్రమంలో భాగంగా ముందుకు జిల్లా కలెక్టర్ సూర్యకుమారి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి రుణ వితరణ మహోత్సవాన్ని ప్రారంభించారు. దీనిలో భాగంగా రుణ సదుపాయం పొందిన ఔత్సాహికులకు, స్వయం సహాయక సంఘాల సభ్యులకు కలెక్టర్, వివిధ బ్యాంకుల రీజినల్ మేనేజర్లు, ఇతర అధికారుల చేతుల మీదుగా చెక్కులను అందజేశారు.
కార్యక్రమంలో ఎల్.డి.ఎం. శ్రీనివాసరావు, డీఆర్డీఏ పీడీ కల్యాణ చక్రవర్తి, మెప్మా పీడీ సుధాకర్, డీసీసీబీ బ్యాంకు సీఈవో జగన్నాథరావు, జిల్లా పరిశ్రమల సంస్థ జీఎం పాపారావు, ఎస్.బి.ఐ. రీజనల్ మేనేజర్ విజయ సుబ్రహ్మణ్యం, ఏపీజీవీబీ రీజనల్ మేనేజర్ చిరంజీవి రావు, యూనియన్ బ్యాంక రీజనల్ మేనేజర్ సుధాకర్, కెనరా బ్యాంకు రీజనల్ మేనేజన్ విజయ శ్రీ, ఇతర బ్యాంకుల ప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, ఇతర రుణ గ్రహీతలు తదితరులు పాల్గొన్నారు
