Women’s Awareness Program from today, District Collector A. Suryakumari
Publish Date : 19/04/2022
నేటినుంచి మహిళా జాగృతి కార్యక్రమం
జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి
విజయనగరం, ఏప్రెల్ 19 ః
విద్యార్థినుల్లో వివిధ అంశాలపట్ల చైతన్యం కల్పించే ఉద్దేశంతో నెల 20 వ తేదీ నుంచి 25వ తేదీ వరకు మహిళా జాగృతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి ఒక ప్రకటనలో తెలిపారు. మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో వైద్యారోగ్యశాఖ, న్యాయశాఖ, పోలీసు శాఖల ప్రతినిధులు పాల్గొని పలు అంశాలపై అవగాహన కల్పిస్తారని తెలిపారు. వివిధ కళాశాలల్లో ఇంటర్ చదువుతున్న విద్యార్థినులకు, కెజిబివి విద్యార్ధినులకు, బాల్య వివాహాల నివారించడం, వీటివల్ల కలిగే దుష్పరిణామాలు, సామాజిక సమస్యలు, పోక్సో ఏక్ట్, లైంగిక ప్రలోభాలు-పరిణామాలు, పోషకాహార లోపం, రక్తహీనత, ఈవ్ టీజింగ్, దిశ యాప్పై అవగాహనా సదస్సులను నిర్వహించడం జరుగుతుందన్నారు. చిన్న వయసులో వివాహం జరిగితే ఆరోగ్యపరంగా తల్లి, బిడ్డకు ఎదురయ్యే దుష్పరిణామాల గురించి వైద్యశాఖ, బాల్య వివాహాలను నిరోధించే చట్టాలు, శిక్షల గురించి న్యాయశాఖ, పోలీసు శాఖలు అవగాహన కల్పిస్తాయని వివరించారు.
ఈ నెల 20న ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ ఆడిటోరియంలో, 21న ఉదయం 10 గంటలకు బొబ్బిలి ఎంపిడిఓ కార్యాలయంలో, 22న ఉదయం 10 గంటలకు చీపురుపల్లి ఎంపిడిఓ కార్యాలయంలో, 23న ఉదయం 10 గంటలకు జామి ఎంపిడిఓ కార్యాలయంలో, 25న ఉదయం 10 గంటలకు ఎస్.కోట ఎంపిడిఓ కార్యాలయంలో మహిళా జాగృతి సదస్సులు ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ సదస్సుల్లో ఆయా చుట్టుప్రక్కల మండలాల విద్యార్థినులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు.